Jana Sena Rajya Sabha.. లోక్ సభలో, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే శాసన మండలిలో జన సేన పార్టీకి సభ్యత్వం వుంది.! మరి, రాజ్యసభలోనో.? ఇంకా ఖాతా తెరవలేదు.!
జాతీయ రాజకీయాల్లో తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకోవాలంటే, రాజ్యసభలో చోటు తప్పనిసరి జన సేన పార్టీకి.! ఆ దిశగా జన సేనాని పవన్ కళ్యాణ్ వ్యూహ రచన గతంలోనే చేశారు.
2024 ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయాల్సిన నాగబాబు, తన సీటుని బీజేపీ కోసం త్యాగం చెయ్యాల్సి వచ్చింది. ఈ క్రమంలో నాగబాబుని రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది.
అయితే, అనూహ్యంగా నాగబాబుని శాసన మండలికి పంపారు జన సేనాని పవన్ కళ్యాణ్. దాంతో, రాజ్యసభకు జన సేన తరఫున ఎవరు వెళ్తారన్న ఉత్కంఠ నెలకొంది.
ఖచ్చితంగా జన సేన పార్టీకి ఓ రాజ్య సభ సీటు దక్కుతుంది. గతంలోనే దక్కాల్సిన సీటుని, పొత్తలో భాగంగా జన సేన వదులుకోవాల్సి వచ్చింది.
ఈసారి వదులుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా, జన సేన పార్టీకి ఓ రాజ్య సభ సీటు రిజర్వ్ అయి వుంటుంది. కానీ, అభ్యర్థి ఎవరన్నదే ఉత్కంఠ.
నాగబాబునే రాజ్య సభకు పంపుతారనీ, ఎమ్మెల్సీ పదవికి నాగబాబు రాజీనామా చేసి, ఆ సీటుని జన సేన పార్టీకే చెందిన మరో కీలక నేతకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
అయితే, అత్యంత నమ్మకస్తుడైన ఓ నాయకుడికి జన సేనాని రాజ్యసభ సీటు ఇవ్వాలనే యోచన చేస్తున్నారనీ, నాగబాబు ఎమ్మెల్సీగా కొనసాగుతూనే మంత్రి అవుతారనీ.. ఇంకో వాదన బలంగా తెరపైకొచ్చింది.
