UPI Payments Extra Charges.. కొన్నేళ్ళ క్రితం మొబైల్ ఫోన్ నుంచి కాల్స్ ‘ఉచితం’ అంటూ ఊదరగొట్టేశారు.
ఆ తర్వాత ఛార్జీల మోత మోగిపోయింది.! అంతకు ఏటీఎం కూడా అంతే.. ఛార్జీల మోత మోగిపోతోంది.. సవాలక్ష ఆంక్షలిప్పుడు.
బ్యాంకుల్లో కూడా అంతే.! ‘మా బ్యాంకులో ఖాతాలు తెరవండి.. ఉచితంగా ఖాతాలు ఓపెన్ చేసుకోండి..’ అంటూ బ్యాంకులు, వినియోగదారుల్ని బతిమాలేవి.
కట్ చేస్తే, నెలవారీ మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్టెయిన్ చెయ్యకపోతే, జరీమానాల బాదుడుతో విరుచుకుపడుతున్నాయి. చెప్పకుంటూ పోతే, ఏదీ ఉచితం కాదు.!
మొదట అలవాటు చేస్తారు.. ఆ తర్వాత, వాయించేస్తారు. కొత్తగా ఈ లిస్టులోకి ‘యూపీఐ’ కూడా చేరిపోయింది.! కేంద్రం తాజాగా, ‘యూపీఐ’ విషయమై ఛార్జీలు ఖరారు చేసింది.
వ్యక్తిగతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ‘యూపీఐ లావాదేవీలు’ ఉచితం.. అని చెబుతోంది కేంద్రం. కానీ, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, వ్యాపార సంస్థలకు చేసే చెల్లింపులపై ఛార్జీలు ఖరారు చేసింది.
‘అబ్బే, వినియోగదారుల మీద పెద్దగా భారం పడదు.. వ్యాపారులకు మాత్రమే కొంత ఇబ్బంది’ అని అంటున్నా, ఆ వ్యాపారులు, యూపీఐ ఛార్జీల భారాన్ని రెండింతలో పదింతలో చేసి, జనం మీదనే కదా రుద్దేది.?
ఎల్పీజీ ధరలు పెరిగినప్పుడు, టిఫిన్ సెంటర్లో కూడా ధరలు పెరిగిపోయాయ్. భారం మోసింది సాధారణ ప్రజలే. యూపీఐ ఛార్జీల విషయంలోనూ అదే జరగబోతోంది.
ప్రస్తుతానికి తక్కువ మొత్తంలోనే యూపీఐ ఛార్జీలు కనిపిస్తున్నా.. సమీప భవిష్యత్తులో ఇవి ఏ స్థాయిలో ప్రజల నడ్డి విరుస్తాయోనన్న ఆందోళన పెరిగిపోతోంది.
ఔను.. ఏదీ ఉచితం కాదు.! ఉచితాన్ని ఆశిస్తే, భంగపడాల్సిందే. అది యూపీఐ అయినా, ఇంకోటైనా.! అందుకే, దేనికీ అలవాటుపడిపోకూడదు.!
యూపీఐ ముందు ముందు భారంగా మారితే, క్యాష్ ఫ్లో అనేది సాధ్యమవుతుందా.? ఫిజికల్ కరెన్సీ మార్కెట్లో అందుబాటులో వుంటుందా.? మళ్లీ పాత రోజుల్లోకి వెళ్ళిపోవడం తప్పదా.?
అన్నట్టు, ఆల్రెడీ చిన్నా చితకా వ్యాపారులు ‘యూపీఐ పేమెంట్స్’ మీద అదనపు ఛార్జీల్ని వసూలు చేసేస్తున్నాయి. వాస్తవానికి, యూపీఐ ఛార్జీలు అక్టోబర్ మూడో వారం నుంచి అమల్లోకి రానున్నాయి.
