Table of Contents
YSRCP 16 Years Politics.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇద్దరితో ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ల్యాండ్ స్లైడ్ విక్టరీతో అధికార పీఠమెక్కే స్థాయికి ఎదిగింది.
కానీ, పరాయి రాష్ట్రంలో అధినేత తలదాచుకునే స్థాయి పతనాన్ని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చవిచూస్తోంది. మళ్ళీ వైసీపీ పుంజుకుంటుందా.?
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న దరిమిలా, వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నా, ఆ సంబరాల్లో ‘నిస్తేజం’ స్పష్టంగా కనిపిస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీని వీడిన వైఎస్ జగన్, తన తల్లి విజయమ్మతో కలిసి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
YSRCP 16 Years Politics.. తల్లిని చెల్లిని.. అధికారాన్నీ దూరం చేసుకుని..
చిత్రమేంటంటే, అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా వున్న వైఎస్ విజయమ్మ, ప్రస్తుతం వైసీపీకి దూరంగా వున్నారు. అప్పట్లో జగన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల కూడా, ఇప్పుడు వైసీపీ వెంట లేరు.
పైగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు షర్మిల. ప్రస్తుతం ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
గడచిన పదహారేళ్ళలో వైసీపీ ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసింది. కానీ, తల్లిని చెల్లిని దూరం చేసుకోవడం ద్వారా, వైఎస్ జగన్.. ప్రజల్లోనూ విశ్వాసం కోల్పోవడం.. వైసీపీకి చాలా పెద్ద దెబ్బ.
విశ్వసనీయత.. అనే మాట గురించి పదే పదే చెబుతుంటారు వైఎస్ జగన్. ఆ విశ్వసనీయతను వైఎస్ జగన్ కోల్పోయింది కూడా తల్లిని, చెల్లిని దూరం పెట్టడం వల్లే.
రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శల దాడి..
రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసే క్రమంలో, వారి కుటుంబాల్లోని మహిళల్ని రాజకీయాల్లకి లాగి అతి పెద్ద తప్పు చేశారు వైఎస్ జగన్.
పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ జగన్ చేసిన రాజకీయం, వైసీపీని అదఃపాతాళానికి తొక్కేసింది 2024 ఎన్నికల్లో. చెప్పుకుంటూ పోతే, వైఎస్ జగన్ చేసిన, చేస్తున్న తప్పిదాలు చాలానే.
వాటిల్లో, అసెంబ్లీకి హాజరు కాకపోవడం, బెంగళూరులనే ఎక్కువగా వుంటుండడం.. వ్యూహాత్మక తప్పిదాలుగా చెప్పుకోవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తిరిగి వైసీపీ పుంజుకోవాలంటే, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా ఆత్మ విమర్శ చేసుకోవాలి.
బెంగళూరుని వదిలి, అసెంబ్లీకి వెళ్ళాలి..
వైసీపీ హయాంలో చేసిన తప్పులకుగాను వైఎస్ జగన్, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పడం ఉత్తమం. ప్రజలకు క్షమాపణ చెప్పినా, చెప్పకున్నా, ఆత్మ విమర్శ అయితే తప్పనిసరి.
ఒక్క ఓటమితో వైసీపీ కాలగర్భంలో కలిసిపోతుందని అనడం సబబు కాదు. కానీ, తిరిగి పుంజుకోవాలంటే, తప్పుల్ని సరిదిద్దుకుని, ముందడుగు వేయాలి.
బెంగళూరుని వదిలేసి, ఆంధ్ర ప్రదేశ్లోనే వుంటూ, పార్టీ శ్రేణులకు.. అందునా ముఖ్య నేతలకు నిత్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందుబాటులో వుండాల్సిందే.
అన్నిటికన్నా ముఖ్యంగా, అసెంబ్లీ సమావేశాలకు పులివెందుల ఎమ్మెల్యే హోదాలో హాజరు కావాల్సి వుంటుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. లేని పక్షంలో, వైసీపీ కాలగర్భంలో కలిసిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు.
