Ys Jagan Shocks YSRCP.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీకి బలహీనత కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డే.!
2024 ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం తర్వాత, పూర్తిగా బెంగళూరుకే పరిమితమైపోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అడపా దడపా మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు.
వచ్చిన ప్రతిసారీ, వైసీపీని నిండా ముంచేస్తున్నారాయన. భారీ హంగామాతో వైసీపీ శ్రేణులు వైఎస్ జగన్ వచ్చినప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. జనాన్ని సమీకరిస్తున్నారు.
మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నదేంటి.? తాడేపల్లి నివాసంలో ప్రెస్ మీట్లు పెట్టినా, జనంలోకి వెళ్ళినా వైఎస్ జగన్ చెప్పే మాటలు నవ్వులపాలైపోతున్నాయి.
తాజాగా, మత్సకార కుటుంబాల్ని పరామర్శించేందుకు విశాఖ వెళ్ళిన వైఎస్ జగన్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రస్తావన తీసుకొచ్చారు.
సీదిరి అప్పలరాజు కుమారుడు ఓ యాక్సిడెంట్ కేసులో అరెస్టయ్యాడు. యాక్సిడెంట్లో ఓ వ్యక్తి మరణించడమే అందుక్కారణం.
Ys Jagan Shocks YSRCP.. చీదర రాజకీయం..
వాస్తవానికి, ఈ కేసులో ఇంకో వ్యక్తిని నిందితుడిగా చూపిస్తూ, పోలీసుల యెదుట లొంగిపోయేలా చేశారు సీదిరి అప్పలరాజు.. అదీ, తన కొడుకుని కాపాడుకునేందుకు.
సీసీటీవీ విజువల్స్తో అసలు విషయం బట్టబయలయ్యింది. సహజంగానే, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి, లోపలేశారు. అది వేరే విషయం.
అలా ఎలా మర్డర్ కేసు పెడతారు.? పద్ధెనిమిదేళ్ళ పిల్లాడు బైక్ నడిపి యాక్సిడెంట్ చేస్తే, అతని ఖర్మ ప్రకారం ఇంకో వ్యక్తి చనిపోతే.. అంటూ వింత మాటలు మాట్లాడారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
నిజానికి, వైఎస్ జగన్ విశాఖకు వెళ్ళిన వ్యవహారం వేరు. అక్కడ మాట్లాడాల్సిన అంశాలు వేరు. ఇందులోకి సీదిరి అప్పలరాజు పేరెందుకు వచ్చింది.? అని వైసీపీ శ్రేణులే విస్తుపోతున్నాయి.
మత్స్యకార వర్గానికి చెందిన వ్యక్తి సీదిరి అప్పలరాజు.. అంటూ మొదలెట్టారు వైఎస్ జగన్. స్క్రిప్ట్ ఎవరు రాశారోగానీ, వైఎస్ జగన్ అనవసరంగా సీదిరి అప్పలరాజు ప్రస్తావన తీసుకొచ్చి అభాసుపాలయ్యారు.
ఇవే, ఇలాంటి తప్పిదాలే పదే పదే చేస్తున్నారు వైఎస్ జగన్. దాంతో, అప్పటిదాకా వైఎస్ జగన్ మాట్లాడిన విషయాలన్నీ పక్కకు వెళ్ళి, కేవలం ట్రోలింగ్ కంటెంట్ మాత్రమే హైలైట్ అవుతోంది.
‘నీ వల్ల పార్టీకి లాభం కంటే, నష్టమే ఎక్కువ జరుగుతోంది జగనన్నా..’ అంటూ వాపోతున్నారు వైసీపీ క్యాడర్.
