Kanakapu Simhasanamuna Sunakamu.. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన.. అని సుమతీ శతకంలో ఓ పద్యం వుంది.
అంటే, ఇక్కడ శునకం అంటే.. నీఛపు బుద్ధి కలవాడి గురించి.. అలాగే కనకపు సింహాసనమంటే.. అధికార పీఠమని అర్థం.
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునమ్
దొనరగ బట్టము గట్టిన
వెనకటి గుణ మేల మాను.? వినరా సుమతీ.!
ఇది సుమతీ శతకములో పేర్కొనబడిన నిత్య సత్యం. దీనర్ధం కుక్కని బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టినా అది ఆ బంగారు సింహాసనాన్ని నాశనం చేస్తుంది తప్ప దాని బుద్ధి మారదని.
భావం ఇంకాస్త వివరంగా చెప్పుకోవాలంటే.. ఒక మంచి ముహూర్తంలో కుక్కను బంగారు సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా, అది దాని నీచ స్వభావాన్ని వదిలి పెట్టదు.
అలాగే ఒక నీచుడికి ఉన్నత పదవిని ఇచ్చినా వాడు తన నీచ స్వభావాన్ని వదలడు సరికదా.. ఆ పదవిని ఆసరాగా చేసుకుని మరింత నీచత్వానికి ఒడిగడతాడు.
Kanakapu Simhasanamuna Sunakamu.. నేటి రాజకీయానికి అన్వయిస్తే..
నేటి సమాజానికి దీన్ని అన్వయించాల్సి వస్తే, రాజకీయం, అధికారం, రాజకీయ నాయకులు, ఓటర్లు, ప్రజల బానిసత్వం లేదా అమాయకత్వం.. ఇవన్నీఇక్కడ కీలకమైన అలాగే అతి ముఖ్యమైన అంశాలు.
ఫలానా వ్యక్తి అధికారంలోకి వచ్చాడు కాబట్టి, తమ జీవితాలు నాశనమైపోయాయని జనం గగ్గోలు పెట్టి ఉపయోగం లేదు.
ఇక్కడ అధికార పీటమెక్కిన వ్యక్తి చేసే అకృత్యాల వల్ల ప్రజలు ఎన్ని పాట్లు పడుతున్నా నిజానికి ఇందులో మొదట నిందించాల్సింది ఆ దుర్మార్గుడికి లేదా దుష్టుడికి పదవిని అప్పగించిన ఓటర్లదే. అంటే ప్రజలదే.
Also Read: ఇంటికో ఇమానం.. ఇంకెందుకు ఆలస్యం.!
ఒక్క అవకాశం.. అని అడిగితే, తమ జీవితాల్ని నాశనం చేసుకుని మరీ, ఓ వ్యక్తికి అధికారమిచ్చేయడం ఎంత ప్రమాదకరమో తెలియనంత అమాయకత్వంలో వున్నారు నేటి ప్రజలు. ఇది అమాయకత్వమా.? మూర్ఖత్వమా.?
అయినా ఎన్నికల ప్రక్రియలో ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయ్. వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు నేటి రాజకీయ నాయకులు. వ్యవస్థ మొత్తం కలుషితమైపోయాకా, ఆ కలుషితమైపోయిన వ్యవస్థలో మార్పు అసాధ్యం.
రాజకీయం సంగతి పక్కన పెడితే, సాధారణ జన జీవితంలో కూడా చెడ్డవారిని అందలమెక్కించకూడదు.
తద్వారా నష్టపోవాల్సి వస్తే, నిందించాల్సింది చెడ్డవాడ్ని కాదు.. ఆ చెడ్డవాడు అందలమెక్కడానికి కారణమైన మనల్నే మనం నిందించుకోవాలి.! ఇదీ కనకపు సింహాసనము.. వెనుక వున్న కఠోరమైన వాస్తవం.!