NEET Paper Leak Row.. వైద్య విద్య కోసం ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష ‘నీట్’ ప్రతియేడాదీ వివాదాస్పదమవుతూనే వుంది.
ఈ ఏడాది పేపర్ లీక్ వ్యవహారం దేశాన్నే కుదిపేసింది.
ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనల నేపథ్యంలో.! మరోపక్క, కేంద్రం.. పేపర్ లీక్ ఘటనలపై ఉక్కుపాదం మోపింది.
తాజాగా, కేంద్రం పేపర్ లీక్ వ్యవహారాల్లో దోషులకు విధించే జరీమానా, శిక్షల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఐదు కోట్ల దాకా జరీమానా.. ఎనిమిదేళ్ళ వరకూ జైలు శిక్ష.. ఇదీ తాజా మార్పు.
కానీ, ఈ శిక్షలు అలానే జరీమానాలు సరిపోతాయా.? వీటితో పేపర్ లీక్స్కి అడ్డుకట్ట వేయగలుగుతామా.? అక్రమాలకు చెక్ పెట్టగలమా.? అంటే, ప్చ్.. కష్టమే.!
వైద్య విద్య విషయానికొస్తే, అందరికీ తెలిసిన విషయమే.. ఇది అత్యంత ఖరీదైన వ్యవహారమని. కన్వీనర్ కోటాలో సీటు దొరికితే అదృష్టం వరించినట్లే.. కష్టం ఫలించినట్లే.
NEET Paper Leak Row.. ఎంబీబీఎస్ సీటు.. రేటు.. హీటు.!
కానీ, ‘బీ’ కేటగిరీ, ‘సీ’ కేటగిరీ సీట్ల విషయానికొస్తే, సాధారణ వ్యక్తులు వైద్య విద్యను అభ్యసించడం దాదాపుగా అసాధ్యం. ఏడాదికి పది లక్షల నుంచి అరవై లక్షల దాకా రేటు పలుకుతోంది.
అంటే, యాభై లక్షల నుంచి కోటిన్నర వరకూ ఎంబీబీఎస్ సీటు ధర పలుకుతోందన్నమాట. ఇంత ఖరీదైన వ్యవహారం కాబట్టే, ‘నీట్’ ప్రవేశ పరీక్షకు సంబంధించి లీకుల వ్యవహారాలు తెరపైకొస్తుంటాయ్.
ఓ అంచనా ప్రకారం లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయల మేర వ్యాపారం కేవలం ‘నీట్’ పరీక్ష చుట్టూ జరుగుతోందిట. ఇంటర్మీడియట్ విద్య, నీట్ కోచింగ్.. వీటికి సంబంధించిన వ్యాపారాల లెక్కలే ఇవి.
అందుకే, అక్రమార్కులు.. లీకు వీరులు.. ‘నీట్’ పరీక్ష లక్ష్యంగా పావులు కదుపుతుంటారు. ప్రతీ ఏడాదీ పరీక్ష ముగియగానే, తదుపరి ఏడాదికి సంబంధించిన కుట్రలు మొదలైపోతాయ్.
వచ్చే ఏడాది నుంచీ ‘జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్’ తరహాలోనే, ‘నీట్’ పరీక్షని కూడా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది.
పరీక్షను ఆన్లైన్లో నిర్వహించడం వల్ల ‘లీక్’ వ్యవహారాలకు కొంతమేర అడ్డుకట్ట వేయొచ్చు. కానీ, ఇంత పెద్ద అక్రమ వ్యాపారానికి అలవాటుపడ్డ కేటుగాళ్ళు.. ఊరికే వుంటారా.?
జైలు శిక్ష, జరీమానా.. ఎంత పెంచినా, ఈ కేటుగాళ్ళ వ్యూహాలకు చెక్ పెట్టడం సాధ్యమేనా.?
