Bhogapuram Chandrababu Vs Jagan.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా చేసింది ఏముంది.? నారా చంద్రబాబునాయుడు ఏమన్నా వ్యక్తిగతంగా చేశారా.?
ముఖ్యమంత్రి హోదాలోనే చంద్రబాబు అయినా, వైఎస్ జగన్ అయినా.. చేసేది.! వ్యక్తులు, రాజకీయ పార్టీలు వేరు.. ప్రభుత్వాలు వేరు.!
ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ఆ ప్రజల కోసం పని చెయ్యాలి. ఈ క్రమంలో వ్యక్తిగత అవసరాల కోసం పని చేసే రాజకీయ నాయకులు వ్యవస్థలో కోకొల్లలుగా కనిపిస్తారు.
అయినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టి, తెరవెనుక కాసుల పంట పండించుకోవడం.. నచ్చిన కాంట్రాక్టర్లను బెదిరించడం.. భూ కూటాయింపుల విషయంలో నీఛ నికృష్ట రాజకీయాలు చేయడం.. ఇదొక నిరంతర ప్రక్రియ.
ఇప్పుడిదంతా ఎందుకంటే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ‘ఘనత’ చుట్టూ కొట్లాటలు జరుగుతున్నాయి టీడీపీ, వైసీపీ మధ్యన.
చంద్రబాబు హయాంలో 2019 ఎన్నికలకు ముందర శంకుస్థాపన జరిగింది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి. దానికే మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయ్యాక శంకుస్థాపన చేశారు వైఎస్ జగన్.
దిక్కుమాలిన రాజకీయాలు.. నిస్సిగ్గు రాజకీయాలు.. ఎలా వుంటాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అయితేనేం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యింది.
కడప స్టీల్ ప్లాంట్ విషయానికొస్తే, ఎన్ని శంకుస్థాపనలు జరిగాయో లెక్కే లేదు.! అటు చంద్రబాబు, ఇటు జగన్.. ఇద్దరూ రాయలసీమకు చెందిన నాయకులే.
కానీ, కడప స్టీలు ప్లాంటుకి దిక్కూ మొక్కూ లేదు ఇప్పటిదాకా.! ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో ‘ఘనత’ మాదే.. అని చెప్పుకోలేకపోతున్నారు ఈ ఇద్దరిలో ఎవరూ.!
పోలవరం ప్రాజెక్టు పరిస్థితి కూడా అంతే.! ఎప్పుడో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు.. ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియని దుస్థితి.
రాజధాని అమరావతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.! మూడు రాజధానులు, మావిగన్.. ఇలా పిల్లిమొగ్గలేస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ‘ఎర్రబస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ పోర్టు ఎందుకు.?’ అని ప్రశ్నించిన మేతావి జగన్, ఇప్పుడు మాట మార్చి, ‘విమానాశ్రయం ఘనత నాదే’ అంటున్నారు.
రాజకీయాలు ఇంతే.. ఇలాగే తగలడతాయి నిస్సిగ్గు రాజకీయాలు.! ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లికార్జున రావు, ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కర్త, కర్మ, క్రియ.!
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది కూడా ఇదే జీఎంఆర్ సంస్థ.! ఆ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చాయి.
మౌళిక సౌకర్యాల్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతోంది. రైతులు, విమానాశ్రయం కోసం భూములిచ్చారు. ఇందులో వ్యక్తిగతంగా వైఎస్ జగన్ అయినా, చంద్రబాబు అయినా అర్థ రూపాయి ఖర్చుపెట్టింది లేదు.
ప్రభుత్వాధినేతలుగా అభివృద్ధికి సహకరించడం అనేది వారి విధి అతే.! ఆ విధిని సక్రమంగా నిర్వహించారా.? లేదా.? అన్నదే ప్రశ్న తప్ప, ‘ఎవరి ఘనత’ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదిక్కడ.!
