Janasena Seat Sharing Hiccups.. జన సేన పార్టీ, 2024 ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 లోక్ సభ నియోజకవర్గాలలో పోటీ చేయడం, 100 శాతం స్ట్రైక్ రేట్తో అన్ని స్థానాల్లోనూ గెలుపొందడం తెలిసిన విషయమే.
2019 ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో జన సేనాని పవన్ కళ్యాణ్ అత్యంత వ్యూహాత్మకంగా అమలు చేసిన ఎత్తుగడ 2024 ఎన్నికల్లో ఫలించింది.
ఎప్పటికప్పుడు అధినేత రాజకీయ వ్యూహాలు మారుతుంటాయి. పార్టీలో కీలక నేతలు, కింది స్థాయి క్యాడర్.. అంతా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి వుంది.
పవన్ కళ్యాణ్ కోసం అవసరమైతే ప్రాణాల్ని సైతం లెక్కచేయని క్యాడర్ వుంది. ఇది జన సేన పార్టీకి ప్రధాన బలం. అదే, ఆ పార్టీకి బలహీనత కూడా.!
జన సేన కీలక నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్, తాజాగా ‘బలమున్న చోటే పోటీ చేద్దాం.. గెలిచే స్థానాల్ని మాత్రమే తీసుకుందాం..’ అంటూ కూటమి సర్దుబాట్ల విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Janasena Seat Sharing Hiccups.. గందరగోళానికి తెరలేపిన నాదండ్ల మనోహర్..
ఈ వ్యాఖ్యల్ని జన సేన శ్రేణుల్లో కొందరు, వేరే రకంగా తీసుకున్నారు. 2029 ఎన్నికల గురించి నాదెండ్ల మనోహర్ ఇప్పుడే ఓ ప్రకటన చేసేశారన్న దిశగా విషయం ‘ఓవర్ టర్న్’ అయ్యింది.
వైసీపీ కావొచ్చు, టీడీపీ కావొచ్చు.. బీజేపీ కావొచ్చు.. కొందరు ఆయా పార్టీల ముసుగులేసుకుని, సోషల్ మీడియా వేదికగా జన సేన పార్టీకి వ్యతిరేకంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో, జన సేన శ్రేణులు కౌంటర్ ఎటాక్ ఇచ్చే ఆలోచన మానేసి, తమంతట తామే ట్రిగ్గర్ అయిపోయారు.. పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించే క్రమంలో మాటలు తూలేస్తున్నారు.
నిజమే, గెలిచే స్థానాల్లోనే పోటీ చేస్తాం.. అంటే, అన్ని సార్లూ రాజకీయాల్లో కుదరదు. వై నాట్ 175 అని నినదిస్తే, వైసీపీకి 11 సీట్లు వచ్చాయ్. కానీ, వైసీపీ వచ్చే ఎన్నికల్లో కూడా 175 స్థానాల్లోనూ పోటీ చేస్తుంది.
టీడీపీ కూడా అంతే.! పొత్తు లేకపోతే అన్ని స్థానాల్లోనూ టీడీపీ పోటీ చేయగలదు. బీజేపీ కూడా పొత్తు లేకుండా అన్ని స్థానాల్లోనూ పోటీ చేసే అవకాశం వుంది.
జన సేన పార్టీ పరిస్థితి ఏంటి.? మిగతా రాజకీయ పార్టీలు వేరు. జన సేన వేరు.! జనసేనాని వ్యూహాలు భిన్నంగా వుంటాయి. తన బలం, బలహీనత.. అభిమానులేనన్న విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు.
అందుకే, పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఆచి తూచి మంచి నిర్ణయమే తీసుకుంటారు. దాన్నెలాగూ పార్టీ శ్రేణులు అర్థం చేసుకుంటాయనుకోండి.. అది వేరే విషయం.
కాకపోతే, అన్ని స్థానాల్లోనూ బలపడి, అన్ని స్థానాల్లోనూ పోటీ చేసే స్థాయికి జన సేన ఎదగాలని ప్రతి కార్యకర్తా కోరుకుంటాడు.. కోరుకోవాలి కూడా.! అదే, జన సేనాని కూడా కోరుకుంటారు.
సాధ్యా సాధ్యాలన్న అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. ఎన్నికల శంఖారావానికి సమయం దగ్గర పడుతున్నప్పుడు.. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు అత్యంత ఖచ్చితత్వంతో వుంటాయ్.
ఈలోగా ఈ డిస్కషన్స్, డిబేట్స్ మామూలే.! ఒక్కటి మాత్రం నిజం.. జన సేన పార్టీ, 2019 నుంచి 2024 వరకు చాలా మారింది. అంతకు మించి, 2029 నాటికి ఇంకా గొప్ప మార్పు జన సేనలో చూడబోతున్నాం.
చివరగా.. హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్.. అనే మాట వినడానికి చాలా బావుంటుంది. కానీ, ప్రస్తుత రాజకీయాల్లో అదంత చిన్న విషయం కాదు.
తప్పుడు వాగ్దానాలు, వేల కోట్లతో నడిచే ఎన్నికలు.. చెప్పుకుంటూ పోతే, ఇదంతా ఓ ప్రసహనం. ఇలాంటి రాజకీయాల్లో ఓ ‘మంచి మార్పు’ దిశగా ఆవిర్భవించిన జన సేన, కొన్ని ఎత్తుపల్లాల్ని చవిచూడక తప్పదు.
అందుకే, ‘హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్’ అనే అస్త్రాన్ని జన సేనాని అత్యంత వ్యూహాత్మకంగా వినియోగిస్తున్నారు.
