Ys Jagan Tweet Fight.. జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధనయజ్ఞం చేశారన్నది ఓ రాజకీయ ఆరోపణ.! పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వైఎస్ హయాంలో ఏం జరిగిందో ప్రపంచమంతా చూసింది.
పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా వచ్చింది 2014లో. అదీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక. ఆ తర్వాతే, పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టాయి.
రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనుల్ని గందరగోళంలో పడేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ హయాంలో.!
టీడీపీ – జన సేన – బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పోలవరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
వచ్చే ఏడాది పోలవరం ప్రాజక్టుని పూర్తి చేసి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.
తాజాగా, పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాల్ని విడుదల చేసింది చంద్రబాబు ప్రభుత్వం.
అయితే, ఆ కాలువల పనులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే 79 శాతం పూర్తయిపోయాయంటున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ ట్వీటేశారు.
ఇదెక్కడి వింత వాదన.? పోలవరం ఎడమ కాలువకి సంబంధించిన జీవో వచ్చిందే 2008లో. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.
నిజానికి, పోలవరం ఎడమ కాలువ పనులు కూటమి ప్రభుత్వ హయాంలోనే యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయన్నది బహిరంగ రహస్యం.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అయితే, కాలువల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయ్యింది తప్ప, ఏదీ ముందుకు సాగలేదు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలోనూ, వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గాల్లో కత్తులు దూస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోజు రోజుకీ తన స్థాయిని తానే దిగజార్చేసుకుంటున్నారు. అప్పుడప్పుడూ బెంగళూరు నుంచి వచ్చే ప్రెస్ మీట్లు కూడా నవ్వులపాలైపోతున్నాయ్.
ప్రతిపక్ష హోదా కోరుకుంటే సరిపోదు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించదలచుకుంటే, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో, అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలి.
అది మానేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, ఆ పోస్టుల కింద, కౌంటర్ ఎటాక్లతో వైఎస్ జగన్ పరువుని మరింతగా బజార్న పడేస్తారు నెటిజన్స్. అంతే తప్ప, ఈ ట్వీట్లతో వైసీపీకి ప్రయోజనమేమీ వుండదు.
