Social Media Slavery.. సోషల్ మీడియా బానిసత్వం.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోందిది.! స్మార్ట్ ఫోన్ చేతిలో వుంటే చాలు, ప్రపంచాన్ని జయించెయ్యొచ్చని భావిస్తోంది నేటితరం.!
బ్యాంకింగ్ సహా అన్ని కార్యకలాపాలు మొబైల్ ఫోన్ వేదికగానే జరిగిపోతున్నాయి. సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాలా.? రోజులో ఎక్కువ భాగం సోషల్ మీడియాకే అంకితమైపోతోంది నేటితరం.!
పాలు తాగే పసి పిల్లాడి నుంచి, కాటికి కాలు చాపుకున్న ముదుసలి వరకు.. సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నవాళ్ళే.!
మరి, ఈ వ్యసనానికి బానిసైపోయినవారిని కాపాడటమెలా.? అదే, మనల్ని మనం కాపాడుకోవడం ఎలా.? మూడో ప్రపంచ యుద్ధం చేయాలా.? ఆ స్థాయి ‘వైరస్’గా ఈ సోషల్ మీడియా బానిసత్వాన్ని అభివర్ణించొచ్చేమో.
కోవిడ్ నేపథ్యంలో ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్లకు అలవాటుపడిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్.. అనే వ్యసనానికి బానిసలైపోయాం మనమంతా.
ఆ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే..
అదే, సోషల్ బానిసత్వానికి ప్రధాన కారణంగా నిపుణులు అభివర్ణిస్తుంటారు. ఇప్పుడీ సోషల్ మీడియాకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన తరుణం రానే వచ్చింది.
తాజాగా, మెటాకి వ్యతిరేకంగా అమెరికాలో పెద్దయెత్తున ఉద్యమం జరుగుతోంది. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్.. ఇవన్నీ యువతని, చిన్న పిల్లల్ని బానిసలుగా మార్చకుంటున్నాయన్నది అమెరికన్ల వాదన.
వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురవుతోందనీ, ప్రధానంగా పిల్లలపై సోషల్ మీడియా చాలా దుష్ప్రభావం చూపుతోందనీ నినదిస్తున్నారు ఆందోళనకారులు.
ఈ మేరకు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.. కోర్టు కేసులూ నమోదయ్యాయి. కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటామని మెటా చెబుతున్నాగానీ, తేడా వస్తే 19 లక్షల కోట్లను కోల్పోవాల్సి వస్తుంది.
తొంభైలలో నికోటిన్ (పొగాకు)కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో, కంపెనీలు పరిహారంగా 206 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి వచ్చింది. అప్పటినుంచే సిగరెట్ ప్యాకెట్లపై క్యాన్సర్ హెచ్చరికలు ముద్రించడం మొదలైంది.
బిగ్ టొబాకో మూమెంట్..
దీన్నే బిగ్ టొబాకో మూమెంట్గా పిలుస్తారు. అమెరికా చరిత్రలో ఇదే అప్పట్లో అతి పెద్ద ఉద్యమం.!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్స్ డిజైన్, వాటి నుంచి నోటిఫికేషన్లు, వాటి కంటెంట్.. వీటన్నిటిపైనా, అమెరికాలో జరుగుతున్న ఉద్యమాన్ని ‘రెండో బిగ్ టొబాకో మూమెంట్’ అని పిలుస్తున్నారు.
ఇంతకీ, మన దేశంలో సోషల్ మీడియాకి వ్యతిరేకగా జనం ఉద్యమించేదెప్పుడు.? నిజానికి, సోషల్ మీడియాకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం లేదు.
సోషల్ మీడియా బానిసత్వానికి వ్యతిరేకంగా వినియోగదారుల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంది. ఇంటి నుంచే మొదలవ్వాలిది. విద్యా సంస్థల్లోనూ అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి.
ప్రభుత్వం, దీన్నొక ఉద్యమంగా తీసుకుని.. అవగాహన కార్యక్రమాల్ని చేపట్టాల్సి వుంది.
