Pawan Kalyan Modi Bonding.. ఎంత మిత్ర పక్షమైనా సరే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం చాలా చాలా అరుదైన సందర్భమే.
ఇటీవల సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్, గత కొన్నాళ్ళుగా ప్రజలకు దూరంగా వుంటున్నారు.. హైద్రాబాద్లోని తన ఇంటి వద్దనే వుంటూ, విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇంట్లోనే వుంటున్నా, ఇంటి నుంచే అధికారిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సర్జరీ జరిగిన రోజే, ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్తో మాట్లాడారు.
తాజాగా, హైద్రాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
తనకున్న సైనస్ సమస్య గురించీ, జరిగిన సర్జరీ గురించీ పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీకి వివరించారు. భుజం సమస్య, వెన్ను సమస్య వుందని, వాటికి సైతం చికిత్స అవసరమని పవన్ కళ్యాణ్ ప్రధానితో చెప్పారు.
ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం..
ప్రజా క్షేత్రంలో నాయకులు ఆరోగ్యంగా వుండాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని, పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోడీ సూచించారు.
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.. అని, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొనిదెలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్తోనూ, పెద్ద కుమారుడు అకిరానందన్తోనూ అలానే, కుమార్తెలు ఆద్య, పోలెనాలతోనూ ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటించారు.
ప్రధాని నరేంద్ర మోడీకి, ఓ కవితను చదివి వినిపించాడు అకిరానందన్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు ప్రధాని మోడీతో అకిరానందన్ చెప్పాడు.
తన ఇంటికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి, పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానం పలికారు. కాస్సేపు కుటుంబ సభ్యులతోనూ, కాస్సేపు పవన్ కళ్యాణ్తో విడిగానూ ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటించారు.
ఆంధీ పవన్ కళ్యాణ్..
‘ఆంధీ’ అంటూ గతంలోనే పవన్ కళ్యాణ్ని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇరవురి మధ్యా అత్యంత సన్నిహత సంబంధాలున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికీ, అసలంటూ కూటమిగా మూడు పార్టీలూ కలవడానికీ ప్రధాన భూమిక పోషించింది పవన్ కళ్యాణ్.
రానున్న రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్లోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఆ మాటకొస్తే, దక్షిణ భారతదేశమంతటా రాజకీయంగా బలోపేతమవ్వాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు.
ఇదే విషయమై జన సేనాని పవన్ కళ్యాణ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఇదొక ప్రత్యేకమైన కలయిక అనీ, ఇంతకు ముందెన్నడూ ఇలాంటి అద్భుతం జరగలేదని డిప్యూటీ సీఎం ఇంటికి ప్రధాని రావడంపై తెలుగునాట రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు.
దేశవ్యాప్తంగా ఇదే అంశమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
