Revanth Reddy KTR Vulgarity.. తెలంగాణలో ‘తిట్ల రాజకీయం’ అత్యంత జుగుప్సాకరంగా మారుతోంది. పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్లో కూడా అదే తీరు.!
ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న దరిమిలా, ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు అన్ని హద్దులూ దాటేస్తున్నారు ‘తిట్ల’ విషయంలో.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీయార్.. ఈ తిట్ల దండకంలో ‘ఛాంపియన్ షిప్’ కోంస పోటీ పడుతున్నట్లుంది వ్యవహారం.
ప్రజల మన్ననలు అందుకోవాలంటే, తమ పార్టీని గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామనే విషయాన్ని రాజకీయ పార్టీలు చెప్పుకోవాలి.
ఈ విషయంలో అధికార పార్టీకి ఇంకాస్త ఎక్కువ బాధ్యత వుంటుంది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తమ హయాంలో జరిగిన అభివృద్ధి, జరగనున్న అభివృద్ధి గురించి చెప్పుకోవాలి.

అలాగని, ప్రతిపక్షానికి బాధ్యత లేదని కాదు. ప్రతిపక్షం మరింత బాధ్యతగా వ్యవహరించాలి. తమ హయాంలో చేసిన అభివృద్ధి, భవిష్యత్తులో అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి గురించి చెప్పుకోవాల్సి వుంటుంది.
కానీ, ఇవేవీ వుండడం లేదు రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచారంలో. తిట్లు.. పచ్చి బూతులు.. మాట్లాడుకుంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్ల దండకం అందుకుంటోంటే, రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే క్రమంలో మాజీ మంత్రి కేటీయార్ హద్దులు దాటుతున్నారు.
‘పొట్టోడా..’ అంటూ, తాజాగా కేటీయార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ‘బ్రోకర్’ అంటూ, కేటీయార్ చేసిన విమర్శల్ని, కేసీయార్ వైపు తిప్పుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.
చంద్రబాబు దగ్గర రేవంత్ రెడ్డి సంచులు మోస్తే, కేసీయార్ కూడా చంద్రబాబు దగ్గర సంచులు మోసినోడే కదా.. అన్న కాంగ్రెస్ ప్రశ్నలకు గులాబీ దళం సమాధానం చెప్పుకోలేకపోతోంది.
ఇవి జస్ట్ స్థానిక ఎన్నికలు మాత్రమే. సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ హీట్ ఇంకేస్థాయిలో పెరగనుందో ఏమోగానీ, ఎన్నికలంటేనే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితిని రాజకీయ నాయకులు తీసుకొస్తున్నారు.
న్యూస్ ఛానళ్ళు, యూ ట్యూబ్ ఛానళ్ళకు, సోషల్ మీడియా హ్యాండిళ్ళకి మాత్రం ఈ తిట్ల దండకం భలేగా ఉపయోగపడుతోంది.
